బెంగళూరు : భారత దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది పాన్ ఇండియా స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీపై. ఇందులో టాప్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఫోటోలు, వీడియోలు , పాటలు పెద్ద ఎత్తున ఆదరణ చూరగొన్నాయి. భారీ ఖర్చుతో దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేశారు ప్రముఖ మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకురాలు, ఒకప్పటి నటి గీతూ మోహన్ దాస్. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తోంది చిత్ర బృందం. ఇక టాక్సిక్ చిత్రం ఆగస్టు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది . హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఒక యువ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి యష్ వైపు వేగంగా వచ్చాడు. అప్పుడు యష్ బాడీగార్డ్ ఆ అభిమానిని పక్కకు లాగడానికి ప్రయత్నించాడు. అయితే యష్ తన భద్రతా సిబ్బందిని అలా చేయకుండా అడ్డుకున్నారు.
తన సిబ్బందిని కాస్త వెనక్కి తగ్గమని యష్ ప్రశాంతంగా కోరారు. ఆ తర్వాత ఆయన సంతోషంగా ఆ అభిమానితో కలిసి ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు సహనటి హుమా ఖురేషి చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యింది. యష్ వినయ పూర్వకమైన స్వభావం, ఆప్యాయతపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే కార్యక్రమంలో, చేతితో గీసిన ఒక చిత్రాన్ని (పోర్ట్రెయిట్) ఆటోగ్రాఫ్ చేయడానికి యష్ మరో అభిమానిని వేదికపైకి ఆహ్వానించారు. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ , హుమా ఖురేషితో సహా పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. టాక్సిక్ తెలుగు వెర్షన్ టికెట్ బుకింగ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా టికెట్ ధరలు సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. ఈ చిత్రం విడుదలైన రోజే రూ. 100 కోట్ల వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
