Iran: భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమంటున్న ఇరాన్
భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమంటున్న ఇరాన్
భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ ప్రకటించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో ఫోన్లో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ ఈ విషయాన్ని తెలిపారు. పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుకొన్న ఇరువురు నేతలు ముస్లిం దేశాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అనంతరం భారత్-పాక్ సంబంధాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఉద్రిక్తతలు తగ్గి ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఇస్లామిక్ రాజ్యాల్లో శాంతి నెలకొనాలన్న సిద్ధాంతపర విధానంపై ఇరాన్ దృష్టి కేంద్రీకరించిన’ట్టు పెజెష్కియన్ తెలిపారు.
భారత్-పాక్ల మధ్య చిరకాల శాంతి నెలకొనేలా జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ స్వాగతిస్తుందని, అందులో భాగంగా రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వ పాత్రను కూడా పోషించగలదని చెప్పారు. పాక్ లో పర్యటించాలని షరీఫ్ కోరగా అందుకు ఆయన అంగీకరించారు. తర్వాత షరీఫ్ మాట్లాడుతూ భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల్లో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశంసించారు. భారత్తో చర్చలు జరపాలనే తాము కోరుకుంటున్నామని, ఇరాన్ మధ్యవర్తిత్వం వహిస్తే స్వాగతిస్తామని తెలిపారు.
భద్రతా మండలిలో పాక్ కు ఇచ్చిన ప్రాథాన్యతపై సభ్య దేశాల అసంతృప్తి
ఉగ్రవాదానికి చిరునామాగా ఉన్న పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ఛైర్మన్ హోదాను కట్టబెట్టడం విమర్శలకు దారి తీస్తోంది. తాలిబన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను కూడా పాక్కు అప్పగించడంపై ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని మిగిలిన సభ్య దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలోనే ఐకరాజ్య సమితి కమిటీల కేటాయింపు ప్రక్రియ జరగాల్సి ఉండగా కేవలం పాక్ డిమాండ్లపై ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఐదు నెలలు ఆలస్యమైందని తెలిపాయి.
‘‘పాకిస్థాన్ మంకుపట్టు, అహేతుక డిమాండ్లపై మండలిలోని ఇతర సభ్యులు విసిగిపోయారు. ఉగ్రవాదంపై భారత్ ను లక్ష్యంగా చేసే పాక్ ప్రయత్నాలకు ఇతర సభ్యులు మద్దతు పలికేందుకు సిద్ధంగా లేరు. మండలి శాశ్వత సభ్య దేశాలు- చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా ఏ కమిటీకీ నాయకత్వం వహించడానికి ఇష్టపడలేదు. పాక్కు కేటాయించిన స్థానం నామమాత్రమైనదే. కానీ.. తాలిబన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం వల్ల ఇస్లామాబాద్, కాబుల్ మధ్య అభిప్రాయభేదాలు తగ్గేందుకు అవకాశం ఉంది’’ అని వివరించాయి. భద్రతామండలిలోని ఆంక్షల కమిటీ, తాలిబన్ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీల అధ్యక్ష పదవులను పాక్ డిమాండ్ చేసింది. తాలిబన్ కమిటీతో పాటు, ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాలను భద్రతా మండలి ఇచ్చింది.