ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్రమణలు తొలగించాలని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్పగించాలని సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం చేసుకున్న ఆ భూములను ఏఎస్ఐ ఆస్తిగా స్పష్టంగా గుర్తించేలా రెవెన్యూ రికార్డులను సరి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దాదాపు 250 సంవత్సరాల పాటు కాకతీయ రాజవంశానికి రాజధానిగా ఓరుగల్లు (వరంగల్) పని చేసిందని అన్నారు. ఇది తన అద్భుతమైన చారిత్రక వారసత్వం, గొప్ప సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి చెందిందని చెప్పారు గంగాపురం కిషన్ రెడ్డి.
కాకతీయ కాలంలో రాజధానిని దండయాత్రల నుండి రక్షించడానికి ఏడు కోట గోడలతో వరంగల్ కోటను ప్రణాళికా బద్ధంగా నిర్మించారని వెల్లడించారు. ఈ కోట ఢిల్లీ సుల్తానులు హైదరాబాద్ నిజాంల దాడులను తట్టుకుని, కాకతీయ పాలకుల శౌర్యం, బలానికి ప్రతీకగా నిలుస్తూనే ఉందన్నారు. అంతే కాకుండా ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు వరంగల్ కోట వాస్తు శిల్పం, శిల్పాలు, దేవాలయాలు , చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసు కోవడానికి సందర్శిస్తారని చెప్పారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోటలో సౌండ్ అండ్ ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు గంగాపురం కిషన్ రెడ్డి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిధిలోని రక్షిత స్మారక చిహ్నమైన వరంగల్ కోట రక్షణ , పునరుద్ధరణ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు.
