న్యూస్ హ్యాండిల్స్ పై జయేష్ రంజన్ ఫిర్యాదు..కేసు నమోదు
మహిళా ఐఏఎస్ అధికారితో మంత్రికి లింకులపై ప్రసారం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా ఐఏఎస్ ల వ్యవహారం చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించి ఎన్టీవీ న్యూస్ ఛానల్ తో పాటు పలు సోషల్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ లలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం అయ్యాయి. ఆయా సామాజిక వేదికల ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లాలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సదరు మహిళా ఐఏఎస్ తో ప్రేమాయణం నడిపారంటూ సంచలన ప్రత్యేక కథనం ఎన్టీవీలో ప్రసారం అయ్యింది. దీనిని ఆధారంగా చేసుకుని మిగతా యూట్యూబ్ ఛానల్స్ కూడా పెద్ద ఎత్తున స్టోరీస్ తో పాటు చర్చలు కూడా చేశారు. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్రసారం చేస్తారంటూ ప్రశ్నించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర వ్యవహారాలలో పెను సంచలనం రేపింది. ఈ తరుణంలో మహిళా ఐఏఎస్ ను వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్. ఈ మేరకు ఆయన ఖండిస్తూ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా సోమవారం అసోసియేషన్ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఐఏఎస్ , మంత్రికి లింకు పెడుతూ స్టోరీ టెలికాస్ట్ చేసిన ఎన్టీవీతో సహా పలు న్యూస్ చానల్స్, సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్. అసోసియేషన్ తరపున ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.
