జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావు

తీవ్రంగా ఖండిస్తున్నాన‌న్న మాజీ మంత్రి

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇత‌ర ఛాన‌ల్స్ లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి కానీ అర్థరాత్రి ఇండ్ల మీద పడి తలుపులు పగల గొట్టడం దుర్మార్గపు చర్య అని ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గతంలో సినిమా వాళ్లని అరెస్టు చేశార‌ని, ఇప్పుడు మీడియా వాళ్లను అరెస్టు చేసి సమాజంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా కావాల‌ని చేస్తున్న కుట్ర‌గా ఆయ‌న పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రతీ ఒకరిని భయపెట్టి వాళ్ల దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంద‌న్నారు హ‌రీశ్ రావు.
రాచరికపు పోకడలతో ఇట్ల అందరినీ భయపెడతామంటే సరికాదు, ప్రజలు బుద్ధి చెప్తార‌ని హెచ్చ‌రించారు. ఐఏఎస్ అధికారుల మీద వార్త వచ్చినంత మాత్రాన అది వాస్తవం అవుతుందా, దాని మీద విచారణ చేయాల్సిన అవసరం లేదా అని ప్ర‌శ్నించారు. అరెస్టు చేసిన వారిలో కొంతమంది వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారని గుర్తు చేశారు. అది కూడా చూడకుండా దుర్మార్గంగా అరెస్టు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు. ఈ అక్రమ అరెస్టుల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ తప్పక అనుభవించి తీరుతుంద‌న్నారు. జర్నలిస్టులందరూ ఏకం అవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!