అమెరికా : యావత్ ప్రపంచానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి. ఇప్పటికే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్న ట్రంప్ ఉన్నట్టుండి మరో బాంబు పేల్చారు. గురువారం కీలక ప్రకటన చేశారు. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏకంగా ప్రపంచంలోని 75 దేశాలకు ఊహించని ఝలక్ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 75 దేశాల పౌరులకు వలస వీసా సేవలను నిలిపి వేయనున్నట్లు ప్రకటించారు. వలస నియంత్రణలను కఠినతరం చేయడానికి, విదేశీ పౌరుల ప్రవాహాన్ని తగ్గించడానికి ట్రంప్ పరిపాలన చర్యలో భాగంగా పాకిస్తాన్ , బంగ్లాదేశ్ సహా పలు దేశాలు ఉన్నాయని తెలిపారు.
ఇదిలా ఉండగా 75 దేశాల పౌరులకు జనవరి 21 నుండి వలస వీసా ప్రాసెసింగ్ను అమెరికా నిలిపి వేయనున్నట్లు స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ కాన్సులర్ కార్యాలయాలను వెట్టింగ్ విధానాలను సమీక్షిస్తున్నప్పుడు ఆమోదాలను నిలిపి వేయాలని ఆదేశించామన్నారు, ఈ నిర్ణయం భారతదేశ పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్ , పాకిస్తాన్లను ప్రభావితం చేస్తుంది. ఇది వలస వీసాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది అమెరికా సర్కార్. పర్యాటక లేదా వ్యాపార వర్గాలకు కాదు , ప్రపంచ వ్యాప్తంగా చట్ట పరమైన వలసలు, కుటుంబాలు , నైపుణ్యం కలిగిన కార్మికులపై దాని సంభావ్య ప్రభావంపై విమర్శలను ఎదుర్కొంది. ఇదిలా ఉండగా పలు దేశాలపై ట్రంప్ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి టారిఫ్ లు విధించారు. దీంతో భారత్ పై గణనీయైమన ప్రభావం నెలకొంది.
