అమరావతి : దేశంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ మార బోతోందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . శనివారం ఏపీలోని కాకినాడలో ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు పునాది వేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఏపీ ఒక కీలక మైలురాయిని అధిగమించిందని చెప్పారు. అక్టోబర్ 2024లో రాష్ట్ర సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అభివృద్ధి చేయాలనే తమ దార్శనికతను ప్రభుత్వం స్పష్టంగా తెలియ జేసిందని ముఖ్యమంత్రి అన్నారు.
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు పరికరాల ఏర్పాటు పనులు ప్రారంభం కావడాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతిదారుగా మార్చడంలో ఒక కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు. తర్లవాడలో గూగుల్ కోసం భూసేకరణ వేగవంతం జరుగుతోందన్నారు. సమగ్ర పెట్టుబడి ప్రాజెక్టులో 7.5 గిగావాట్ల సౌర , పవన విద్యుత్ సామర్థ్యం, అలాగే 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ జలవిద్యుత్ కేంద్రం ఉన్నాయని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన పర్యావరణ వ్యవస్థ బలాన్ని ప్రదర్శిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తారని తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు అని పేర్కొన్నారు సీఎం.
