తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి , టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు సంచలనంగా మారారు. తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. దీంతో తనను వెంటనే తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు, వందల కోట్ల మంది భక్తులు కలిగిన తిరుమల ఆలయానికి చైర్మన్ గా ఇలాంటి వ్యక్తి ఉండడం భావ్యం కాదని, తక్షణమే తను తన పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నారు. దీంతో ఈ అసభ్యకరమైన వీడియోలపై స్పందించారు బీఆర్ నాయుడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలని నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ నాయుడు.
వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినదని పేర్కొన్నారు. .. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం తప్పా మరోటి కాదన్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై తాను చట్ట ప్రకారం ముందుకు వెళతానని ప్రకటించారు బీఆర్ నాయుడు.
నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు .
