అమెరికా : ఇజ్రాయెల్ , అమెరికా ఇరాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల మధ్య కీలక ప్రకటన చేసింది అమెరికా. ప్రస్తుతానికి యుద్దానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గత రెండు రోజులుగా ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా అటు వైపు నుంచి సానుకూలంగా స్పందన రావడంతో గత్యంతరం లేక తాత్కాలికంగా యుద్దం చేయడం నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన స్వంత సోషల్ మీడియా సోషల్ ట్రూత్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఈ దాడులు ఐదు రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కొనసాగించాలా లేదా అన్న విషయం మరోసారి కీలక ప్రకటన చేయనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. మధ్య ప్రాచ్యంలో మన మధ్య నెలకొన్న వైరుధ్యాలకు సంపూర్ణ, సమగ్ర పరిష్కారాన్ని కనుగొనే దిశగా, గత రెండు రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు , ఇరాన్ దేశం మధ్య అత్యంత సానుకూలమైన, ఫలప్రదమైన చర్చలు జరిగాయని తెలియ జేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ వారం అంతా కొనసాగనున్న ఈ లోతైన, వివరణాత్మక , నిర్మాణాత్మక చర్చల తీరుతెన్నులను, వాటి స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చలు విజయవంతం అయ్యాయని నేను భావిస్తున్నా. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు , ఇంధన మౌలిక సదుపాయాలపై చేపట్టాల్సిన అన్ని రకాల సైనిక దాడులను వాయిదా వేయాలని నేను యుద్ధ శాఖను ఆదేశించానని వెల్లడించారు ట్రంప్.
