బెంగళూరు : మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో మార్చి 28వ తేదీ నుంచి అత్యంత జనాదరణ పొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది. తొలి సెషన్ లో 20 మ్యాచ్ లు మాత్రమే జరగనున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ కు అనుగుణంగా మ్యాచ్ లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ తరుణంలో తాజాగా ఐపీఎల్ లో నిర్వహించే వేలం పాట గురించి ప్రస్తావించాడు రాబిన్ ఊతప్ప.
మనం క్రికెట్లో వేలం విధానాన్ని ఆపాలని స్పష్టం చేశాడు అది మొదలైనప్పుడు దాని ప్రాముఖ్యత నాకు అర్థమైందని అన్నాడు. అప్పట్లో అది అందరి దృష్టిని ఆకర్షించి, పెద్ద విజయం సాధించాలని మీరు కోరుకున్నారు. కానీ ఈ రోజుల్లో, మనుషులను సరుకుల్లా అమ్మడం గానీ, వారిని వేలంలో పడేయడం గానీ ఎవరూ కోరుకోవడం లేదన్నాడు.
మీరు NFL, NBA వంటి అమెరికన్ క్రీడలను చూస్తే, అక్కడ డ్రాఫ్ట్ విధానం ఉందన్నాడు రాబిన్ ఊతప్ప, అది ఆటను మరింత ఆసక్తికరంగా చేస్తుందన్నాడు. అయినా మనం ఇప్పటికీ వేలానికే కట్టుబడి ఉన్నాం, ఎందుకంటే అది వినోదాన్ని ఇస్తుందని. దీనికి మంగళం పాడితే మంచిదని సూచించాడు. అయితే, వినోదానికి ఒక హద్దు ఉంటుంది, మనం ఆ హద్దును దాటుతున్నట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. మనం మన సమాజంలోకి, మన కమ్యూనిటీలలోకి ఆ గౌరవాన్ని తిరిగి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నాడు రాబిన్ ఊతప్ప.
