ఏపీపై విశ్వాసానికి ప్రతీక ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్
బ్రాండ్ సీబీఎన్ వల్లే భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి రాక
అనకాపల్లి : ఈరోజు ఆర్సెలర్ మిట్టల్ , నిప్పాన్ స్టీల్స్ చేస్తున్నది కేవలం భూమి పూజ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక విశ్వాసం, నమ్మకంతో కూడిన ప్రకటన అని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజాప్రభుత్వం చెప్పింది చేయగలదని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశామన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఏఎంఎన్ఎస్ సంస్థ నిర్మించనున్న దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుడారు. ఇది స్టీల్ ప్రాజెక్టు గురించి మాత్రమే కాదు, మన బలం, ధైర్యం, నమ్మకం గురించి. ఒకసారి మిమ్మల్ని 2019 జనవరి నాటి దావోస్ కి తీసుకెళ్తాను. అప్పట్లో నేను అదిత్య మిట్టల్ని కలవాలని ప్రయత్నించాను, కానీ సమయం ఇవ్వలేదు. టాటా గ్రూప్ నైట్ క్యాంప్ లో ఆయనను కలిసి ఒక సింపుల్ అభ్యర్థన చేశాను.
“ఆంధ్ర ప్రదేశ్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయరు?” అని అడిగాను. ఆయన మర్యాద పూర్వకంగానే “మేము ఇప్పటికే మరో రాష్ట్రాన్ని చూస్తున్నాం” అన్నారు. “మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. అది జరగకపోతే, ఆంధ్రప్రదేశ్ మీకోసం సిద్ధంగా ఉంది.” అని చెప్పాను. సంవత్సరాలు గడిచాయి. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు 94 శాతం స్ట్రైక్ రేట్ తో మరో అవకాశం ఇచ్చారు. మేం మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే, ఒక్క రోజు కూడా వృథా చేయకుండా వేగంగా ముందుకు సాగాం. 2024 సెప్టెంబర్ 22 ఆదివారం రాత్రి 8:30 గంటలకు అదిత్యతో మాట్లాడిన 30 నిమిషాల జూమ్ కాల్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేసింది. ఆ కాల్ తో భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ పొందగలిగాం. ఇది ఆధునిక ఆంధ్రపదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనం అని ప్రకటించారు నారా లోకేష్.
