న్యూఢిల్లీ/అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిధుల సాధనే లక్ష్యంగా, అభివృద్ధి పనుల ఆమోదమే మార్గంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన నివాసంలో మంత్రి దుర్గేష్ కలిశారు. ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో ఐకానిక్ పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక సర్క్యూట్ల బలోపేతం కోసం మంత్రి కందుల దుర్గేష్ చేసిన విన్నపాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతానికి రూ. 915 కోట్ల విలువైన 9 కొత్త ప్రాజెక్టులతో పాటు, తెలుగు భాష , కళల పరిరక్షణకు సంబంధించి పెండింగ్లో ఉన్న 6 కీలక సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించగా కేంద్రం సానుకూలంగా స్పందించింది.
గతంలో మంత్రి కందుల దుర్గేష్ చేసిన కృషి ఫలితంగా శాస్కి, ప్రసాద్, స్వదేశీ దర్శన్, సిబిడిడి వంటి పథకాల కింద రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 430 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వాటి పురోగతిని వివరించి త్వరితగతిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మంత్రి దుర్గేష్ ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందిస్తూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
