ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన దురంధర్ -2 దుమ్ము రేపుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో స్పందించాడు నటుడు అనుపమ్ ఖేర్. దర్శకుడి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. ఈ సినిమాను తాను చూశానని, సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యానని తెలిపాడు. ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు అనుపమ్ ఖేర్.
దురంధర్ -2 లో పచ్చి నిజాలు చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడని తెలిపాడు. కొన్నిసార్లు మాటలు కూడా సరిపోవు అన్నాడు. మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు, మీ అంతరంగంలో ఒక నిశ్శబ్దం ఆవహిస్తుందన్నాడు. ఇది కేవలం ఒక సినిమా కాదని, ఇది ఒక అనుభవం. ఒక భావోద్వేగం. నిశ్శబ్దంగా మీ హృదయంలోకి ప్రవేశించి, ఆపై అక్కడి నుండి బయటకు వెళ్లడానికి నిరాకరించే ఒక ప్రయాణం ఇది అని స్పష్టం చేశాడు. నాకు కలిగిన భావనలను బంధించడానికి నేను ప్రయత్నించానని తెలిపాడు అనుపమ్ ఖేర్. నేను ఇంకా ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉండగలిగేవాడిని. ఎందుకంటే కొన్ని కథలు కేవలం వర్ణించడానికి ఉద్దేశించినవి కావు అని అన్నాడు. ఇదిలా ఉండగా ఆదిత్య ధర్ తీసిన దురంధర్ -1కి దురంధర్ -2 సీక్వెల్. ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకు పోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
