అమరావతి : ఏపీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు చేసింది ఏపీ రాష్ట్ర ప్రజలకు. ఎండ వేడిమి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైతే తప్పా బయటకు రావద్దని కోరింది. సోమవారం నాడు ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోని 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అంతే కాకుండా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రకర్ జైన్ వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలో (9 మండలాలు), విజయనగరం (18), పార్వతీపురం మన్యం (15), అల్లూరి (1), పోలవరం (3), అనకాపల్లి (3), ఏలూరు (2) జిల్లాల్లోని మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం (2 మండలాలు), విజయనగరం (5), అల్లూరి (4), పోలవరం (9), అనకాపల్లి (5), కాకినాడ (5), తూర్పు గోదావరి (9), ఏలూరు (4), NTR (3), పల్నాడు (2), నంద్యాల (1) జిల్లాల్లోని మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కడప జిల్లాలోని పొట్టిపాడులో గరిష్ట ఉష్ణోగ్రత 43.8 డిగ్రీల సెల్సియస్గా, తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలుగా, నంద్యాలలో 42.9 డిగ్రీలుగా , అనంతపురం జిల్లాలోని తెరణ్ణపల్లెలో 42.3 డిగ్రీలుగా నమోదైనట్లు జైన్ పేర్కొన్నారు. ఎండకు గురికాకుండా ఉండటం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ సూచించారు.
