న్యూఢిల్లీ : కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాసిక్ కార్పొరేట్ జిహాద్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం, డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. తెలంగాణ తన వంతు కోసం మౌనంగా వేచి ఉండకూడదని పేర్కొన్నారు.
హైదరాబాద్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారి కార్యస్థలం కెరీర్ కోసం ఉండాలే తప్పా జిహాద్ లవ్ పేరుతో బలవంతం చేయడం, వేధింపులకు పాల్పడడం, మత పరమైన లక్ష్యాలు, దోపిడీ లేదా రహస్య ఒత్తిడి నెట్వర్క్ల కోసం కాదని స్పష్టం చేశారు. అన్ని ప్రధాన ఐటీ కంపెనీల అధిపతులతో, ముఖ్యంగా హెచ్ఆర్ బృందాలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని డీజేపీని ఆదేశించారు కేంద్ర మంత్రి. కఠినమైన జవాబుదారీతనాన్ని అమలు చేయాలని అన్నారు. ఏ ఫిర్యాదునూ కప్పిపుచ్చ కూడదన్నారు. ఏ బాధితుడినీ ఒంటరిని చేయకూడదన్నారు.
ఏ యాజమాన్యం కూడా చూసి చూడనట్లు వ్యవహరించ కూడదని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాల్లోని సంఘటనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారని , దీనిపై దృష్టి సారించాలన్నారు. కంపెనీ అధిపతులు, హెచ్ఆర్లు, మేనేజర్లు ఉద్యోగుల భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. బహిరంగంగా ఫిర్యాదు చేయడాన్ని ప్రోత్సహించాలని, ప్రతి సమస్యను తీవ్రంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
