రేపే ఒంటిమిట్ట‌లో కోదండ రాముడికి ప‌ట్టు వ‌స్త్రాలు

నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

అమరావతి : నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సంధర్భంగా సీతారాముల వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు నేరుగా అతిపెద్ద నగదు బదిలీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా జరుగుతోంది. 22 నెలల్లోనే రూ.60,437 కోట్లను ప్రభుత్వం పింఛన్ల రూపంలో పేదలకు అందించింది. ఈ ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 62.60 లక్షల మందికి పింఛనుదారులకు రూ.2,724 కోట్లను విడుదల చేసింది. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనే నెల్లూరు జిల్లాలో 2.91 లక్షల మందికి రూ.128 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 39,330 మందికి రూ.17.81 కోట్లు, వింజమూరు మండలంలో 5,484 మందికి రూ.2.47 కోట్లను ప్రభుత్వం పింఛన్లు ఇవ్వనుంది.

ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు. వింజమూరులోని ఉత్తర ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని చేపడతారు… లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 02.15 గంటలకు ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం 04.25 గంటలకు ఒంటిమిట్టకు సీఎం చేరుకుంటారు. 06.15 గంటలకు కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 06.45 గంటలకు కళ్యాణవేదికలో నిర్వహించే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. బుధవారం రాత్రికి ఒంటిమిట్టలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!