అమరావతి : గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానం వేగవంతం చేసేందుకు ఏపీ సర్కార్ తో తాజాగా ఒప్పందం చేసుకుంది డిజిటల్ భారత్ నిధి. ఈ కార్యక్రమం ద్వారా, గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ఈ-పరిపాలన , ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, పౌర-కేంద్రిత సేవలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ అవగాహన ఒప్పందం సంతకాల కార్యక్రమంలో శ్యామల్ మిశ్రా , డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఖరే, సీఈవో గీతాంజలి శర్మ, డైరెక్టర్ పాప సుధాకర రావు , డీడీఓ దినేష్ కుమార్ గార్గ్ పాల్గొన్నారు కేంద్రం నుండి రూ. 2,432 కోట్ల ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో సవరించిన భారత్ నెట్ కార్యక్రమాలు చేసేందుకు ఈ ఒప్పందం చేసుకుంది.
న్యూఢిల్లీలోని ‘సంచార్ భవన్’లో జరిగిన ఈ ఎంఈఓ సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు, గ్రామాలకు డిమాండ్ ఆధారంగా పటిష్టమైన, భవిష్యత్తు అవసరాలకు తగిన బ్రాడ్బ్యాండ్ అనుసంధానాన్ని కల్పించే లక్ష్యంతో ముందుకు సాగనుంది. ఇప్పటికే ఉన్న భారత్ నెట్ నెట్వర్క్ను ఆధునీకరించడం, ఏకీకృతం చేయడం, విస్తరించడం కోసం కేంద్ర మంత్రివర్గం 2023 ఆగస్టు 4న సవరించిన భారత్ నెట్ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో సవరించిన భారత్ నెట్ కార్యక్రమం కింద, ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్స (ఏపీబీఐఎల్) సంస్థ చేపడుతుంది. ఈ కార్యక్రమం మొత్తం 13,426 గ్రామ పంచాయతీలను పరిధిలోకి తీసుకుంటుంది. ఇందులో నెట్వర్క్ పటిష్టతను పెంచడానికి 1,692 మొదటి దశ గ్రామ పంచాయతీల నెట్వర్క్ నిర్మాణాన్ని ‘లీనియర్’ పద్ధతి నుండి ‘రింగ్ టోపాలజీ’కి ఆధునీకరించడం, 11,254 రెండవ దశ గ్రామ పంచాయతీలకు అనుసంధానం కల్పించనుంది.
అంతే కాకుండా కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలను ఈ జాబితాలో చేర్చడం వంటి అంశాలు ఉన్నాయి. అదనంగా 3,942 గ్రామాలకు డిమాండ్ ఆధారంగా బ్రాడ్ బ్యాండ్ అనుసంధానం చేయనుంది. భారత ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఐదు లక్షలకు పైగా గ్రామీణ గృహ ఫైబర్ కనెక్షన్లను కల్పించడానికి ఈ కార్యక్రమం దోహదప డుతుందని ఆశిస్తున్నారు.