జనగామ జిల్లా : 60 సంవత్సరాల కాంగ్రెస్ దుర్మార్గాన్ని, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తన దీక్షతో ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ పైన అడ్డగోలుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక నుంచి నోరు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నదులపై, తెలంగాణపై కనీస అవగాహన లేని హౌలా అంటూ సీఎంను ఏకి పారేశారు కేటీఆర్.
ఇంటింటికీ నీళ్లు ఇచ్చినందుకు, అమ్మలక్కలకు ఆసరా పెన్షన్లు ఇచ్చినందుకు, ముసలి వారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్ను 10 రెట్లు పెంచినందుకు, రైతన్నలకు రైతుబంధు ఇచ్చినందుకు, రైతు బీమా ఇచ్చినందుకు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి దేశంలోనే పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినందుకు, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ ఎలా అంటాడని ప్రశ్నించారు.
వరంగల్ రైతు డిక్లరేషన్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఎకరానికి రైతుబంధు 15000 ఇస్తా, రైతులతో పాటు కౌలుదారులకు రైతుబంధు అముల చేస్తా, ప్రతి పంటకు 500 రూపాయలు అదనపు బోనస్ చెల్లిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసం చేశారని ఆరోపించారు. ఆ హామీలు ఇప్పుడు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
మొదటి సంవత్సరమే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ అనే హౌలా మాటలు విని ప్రతి ఒక్క నిరుద్యోగి విద్యార్థి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారని అన్నారు. చదువుకున్న విద్యార్థులను, నిరుద్యోగులను మోస పూరిత మాటలతో రెచ్చగొట్టిన రాహుల్ గాంధీని ఉరి తీయాలని అన్నారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు 2500 ఇవ్వలేని సీఎం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటుండడం విడ్డూరంగా ఉందన్నారు.
