అమరావతి : తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు , మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో మకాం వేసిన జగన్ అక్కడి నుంచే ఏపీలో కుట్రలకు తెర లేపాడాంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కుట్రల అమలుకు బెంగళూరులో బ్యాక్ ఆఫీస్ పెట్టారంటూ మండిపడ్డారు. అవినీతి కార్యకలాపాలకు బెంగళూరు ప్యాలెస్సునే కేంద్రంగా చేసుకున్నారంటూ జగన్ పై ఆరోపణలు చేశారు యనమల రామకృష్ణుడు. తను అక్కడే మకాం వేయడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.
తన అవినీతి సంపదను జగన్ బెంగళూరు ప్యాలెస్సుకు తరలించారని ఫైర్ అయ్యారు. వాటిని ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అసలు బెంగళూరు జగన్ జన్మస్థలం కాదని, పోనీ సొంత నియోజకవర్గం కానే కాదన్నారు. అయినా అక్కడే ఎందుకు ఉంటున్నారంటూ ప్రశ్నించారు యనమల రామకృష్ణుడు. జగన్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కాదు… కనీసం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం కాదు… అలాంటప్పుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్సులో ఎందుకు మకాం వేస్తున్నారంటూ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగి పోయాయని అన్నారు.
ఏడీఆర్ తాజా రిపోర్ట్ ప్రకారం జగన్ సహా వివిధ వైసీపీ కీలక నేతల ఆస్తులు ఉన్నట్టుండి 600 శాతం మేర పెరిగాయని తెలిపిందని చెప్పారు. ఆయన ఏం ఉద్దరించారని ఇలా ఆస్తులు పెరిగాయో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జగన్, వైసీపీ నేతలు నియో రిచ్ క్లబ్ నుంచి వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ లో చేరుతున్నారని , వీరందరిపై విచారణ జరపాలని కోరారు.
