తాడేపల్లి గూడెం : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వేదికగా కొన్నేళ్లుగా స్వచ్చందంగా , నిస్వార్థంగా సేవలు అందజేస్తూ వస్తోంది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT). అయితే ఈ సంస్థకి FCRA పర్మిషన్లను కేంద్ర సర్కార్ నిలిపి వేసింది. జగన్ ఈ విషయాన్ని కేంద్ర సర్కార్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన పార్టీకి చెందిన ఎంపీలు సైతం పార్లమెంట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా తన విన్నపాన్ని మన్నించి కేంద్రం రెన్యువల్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్షాకి ధన్యవాదాలు తెలియ చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు జగన్ రెడ్డి. తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాని, RDTకి FCRA అనుమతుల విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. నిజంగా ఆయన కృషిచేసి ఉంటే, ఏప్రిల్ 21, 2025లో నిలిచి పోయిన పర్మిషన్ల రెన్యువల్కు ఏడాది కాలం ఎందుకు పట్టింది అని ప్రశ్నించారు. చంద్రబాబు పట్టించుకోక పోవడంవల్లే వైయస్సార్సీపీ సహా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు.
