హైదరాబాద్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు ఈవీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోందని అన్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కేవలం 544 ఈవీలతో మొదలైన ఈవీల సంఖ్య, నేడు 2.5 లక్షలకు పైగా ఉండటం, 1,030కి పైగా ఛార్జింగ్ స్టేషన్లు (2030 నాటికి 6,000 ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో) ఏర్పాటు చేయడం ద్వారా, స్వచ్ఛమైన రవాణా వృద్ధిని, ఉద్యోగాలను, ఆవిష్కరణలను నడిపిస్తుందో ఈ రాష్ట్రం చూపిస్తోందన్నారు.
₹577 కోట్ల ప్రోత్సాహకాలు, 100% రోడ్ టాక్స్ , రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు, పటిష్టమైన మౌలిక సదుపాయాల పెట్టుబడుల వంటి బలమైన విధానప రమైన మద్దతుతో, ద్విచక్ర వాహనాల నేతృత్వంలో ఈవీ అమ్మకాలు 126% సీఏజీఆర్ (CAGR) వృద్ధిని సాధిస్తున్నాయని తెలిపారు ఎంపీ . ప్రభుత్వం సుమారు 9 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులకు 20% రాయితీని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇది ఈవీల వినియోగాన్ని , అందుబాటు ధరలను మరింతగా ప్రోత్సహిస్తుందన్నారు. ఈ పరివర్తనను నడిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, పారిశ్రామిక నాయకులకు, స్టార్టప్లకు ,పారిశ్రామికవేత్తలకు అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని చెప్పారు. తమ సీఎం రాష్ట్రం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు.
