న్యూఢిల్లీ : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పులికాట్ సరస్సులో సుమారు 20 వేల మంది సంప్రదాయ మత్స్యకారులు గత రెండు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రస్తావించారు. రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో పెద్ద యాంత్రిక పడవలతో పొరుగు రాష్ట్రాల మత్స్యకారులు అక్రమంగా చొరబడి వలలు, పడవలకు నష్టం కలిగించడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి, శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇస్తూ, తీరప్రాంత జలాల్లో మత్స్యకార కార్యకలాపాల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని తెలిపారు. మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ చట్టాల ద్వారా సంప్రదాయ మత్స్యకారులకు ప్రత్యేక జోన్లు కేటాయించి యాంత్రిక పడవల ప్రవేశాన్ని నిషేధించామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన యాంత్రిక పడవలు పులికాట్ సరస్సు సహా ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం 2023 మార్చి 29న ప్రాంతీయ మత్స్యకార నిర్వహణ మండళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు ఎంపీ మద్దెల గురుమూర్తి. ఇటు రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
