హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలకమైన పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పాలనా పరంగా అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో గతంలో 10 ఏళ్లపాటు ఏలిన కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన కె. రామకృష్ణా రావు అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఇలాఖాలో కూడా కీలకమైన పదవి చేజిక్కించుకున్నారు. ఆయనకంటే సీనియర్లు ఉన్నప్పటికీ సీఎం అండదండలు ఉండడంతో తనకే సీఎస్ పదవి లభించింది. ఒక రకంగా ఆయన కొలువు తీరడం ప్రతి ఒక్కరినీ విస్తు పోయేలా చేసింది. తాజాగా తన పదవీ కాలం దగ్గర పడింది. వచ్చే మార్చి నెల 31 వరకు గడువు మాత్రమే ఉంది. దీంతో రోజులు దగ్గర పడుతుండడంతో తదుపరి కీలకమైన సీఎస్ పదవి ఎవరికి ఇస్తారన్నే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి.
ఇక గత బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన , ఐటీ , పరిశ్రమల శాఖలో ముఖ్య భూమిక పోషించిన సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ తో పాటు మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సచివాలయంలో. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయలేక సతమతం అవుతోంది. ఈ తరుణంలో కీలకమైన ఈ పదవిలోకి వచ్చే వారికి తలకు మించిన భారంగా మారనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుత సీఎస్ గా ఉన్న రామకృష్ణారావు గత ఏడాది ఆగస్టు నెలలోనే రిటైర్ కావాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి పనిగట్టుకుని కేంద్రానికి తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరడంతో సీఎస్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు జయేష్ రంజన్ వైపు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు టాక్.
