ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముస్లింలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు భారత దేశంలో హిందూ జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు మనకు పోటీగా ముస్లింలు ముందుకు వస్తున్నారని, జనాభా పెరుగుతోందన్నారు మోహన్ భగవత్. ఇదే సమయంలో ప్రేరేపణ లేదా బలవంతం ఆధారిత మత మార్పిడులను ఆపాలని స్పష్టం చేశారు. హిందూ సమాజాన్ని ఏకం చేసి సాధికారత కల్పించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు, ఎటువంటి ముప్పు లేదు కానీ అప్రమత్తత అవసరం అని అన్నారు.
హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కలిగి ఉండటం పరిగణించాలని సూచించారు. చొరబాటుదారులను ప్రధానంగా గుర్తించి, తొలగించి, బహిష్కరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరస్వతి శిశు మందిర్లో జరిగిన సామాజిక సామరస్య సమావేశంలో ప్రసంగించారు భగవత్. తగ్గుతున్న హిందూ జనాభా కొంత ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ప్రజలను తిరిగి హిందూ మతంలోకి తీసుకు రావడానికి , వారి సంక్షేమాన్ని నిర్ధారించే ప్రయత్నాలను వేగవంతం చేయాలని కూడా ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం మన ముందున్న ప్రధాన సమస్య ఇదని, దీనిని సాధ్యమైనంత వరకు లేకుండా చేయాలని అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్.
భవిష్యత్తులో సగటున మూడు కంటే తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న సమాజాలు కనుమరుగవుతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కలిగి ఉండటాన్ని పరిగణించాలని కూడా ఆయన అన్నారు. కొత్తగా పెళ్లైన జంటలకు దీని గురించి అవగాహన కల్పించాలని సూచించారు.
