అమరావతి : తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన చేసింది. బుధవారం పలు కమిటీలను వెల్లడించింది. ఇదే సమయంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను నియమించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు కొనసాగుతారు. సీనియర్లకు గౌరవం ఇచ్చింది పార్టీ. కొత్తవారికి అవకాశాలు కల్పించింది. సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు చేసింది.
విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చింది హై కమాండ్. ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేసింది. పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి కమిటీలో కీలక వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చింది.
29 మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేసింది అధిష్టానం. 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులు-3, జాతీయ ఉపాధ్యక్షులు-18, జాతీయ అధికార ప్రతినిధులు-10 మందిని నియమించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్ల-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77 మందికి ఛాన్స్ కల్పించింది. నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొరి చొప్పున నియమించింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై కసరత్తు చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.ఇదిలా ఉండగా త్వరలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహా నాడు నిర్వహంచనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నారా లోకేష్ ను సీనియర్ నేతలు అభినందించారు.
