అమరావతి : ఏపీ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాజధానిలోని సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఎస్ ఈ రామచంద్ర రావు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన ఈసిఆర్ఎఫ్ డ్యాం పనులు గ్యాప్-1 లో 45 శాతం, గ్యాప్-2 లో 22 శాతం పూర్తయ్యాయని తెలిపారు మంత్రికి.
ఎడమ కాలువ పనులు ఈ ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేయాలని, అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకెళ్తామని చెప్పారు. కుడి, ఎడమ కాలువల టన్నెల్స్ కనెక్టివిటీల పనులు 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. స్పెల్ వేకి దిగువన బ్రిడ్జి నిర్మాణ పనులకు షెడ్యూల్ రూపొందించాం అన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కు ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రి లకు జాతీయ రహదారులతో అనుసంధానించేలా పరిశీలిస్తున్నాం అని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు.
పోలవరం ప్రాజెక్టును టూరిజం హబ్ గా లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేసేందుకు 9900 ఎకరాల విస్తీర్ణంతో లైడార్ సర్వే పూర్తి చేశామని ప్రకటించారు. ఆరు నూరైనా, ఎన్ని కష్టాలు ఎదరైనా సరే వచ్చే ఏడాది 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు మంత్రి. ఇదే క్రమంలో పలుమార్లు ఢిల్లీకి సీఎం వెళ్లారని తెలిపారు.
