ధర్మశాల : ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దంచి కొట్టింది. ప్రత్యర్థి జట్టు గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది. అటు బ్యాటింగ్ లో చెలరేగింది. బౌలింగ్ లో దుమ్ము రేపింది. దెబ్బకు గుజరాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. 92 పరుగుల భారీ తేడాతో ఓడి పోయింది. నిన్నటి దాకా విజయాలు సాధిస్తూ వచ్చిన టైటాన్స్ కు కోలుకోలేని షాక్ తగిలింది. దీంతో ఈ విజయంతో బెంగళూరు రాయల్ గా ఐపీఎల్ 19 సీజన్ లో ఫైనల్ కు వెళ్లింది. కప్పు గెలిచేందుకు అడుగు దూరంలో ఉంది. ఇక మ్యాచ్ విషయానికి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ నమోదు చేసింది. రికార్డ్ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 రన్స్ చేసింది.
జట్టు కెప్టెన్ రజిత్ పాటిదార్ గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఎడాపెడా షాట్స్ బాదాడు. ఆపై కళ్లు చెదిరేలా మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. షాట్స్ తో కదం తొక్కాడు. ఏకోశానా ఛాన్స్ ఇవ్వలేదు. దంచడమే మొదలు పెట్టాడు. దీంతో కెప్టెన్ గిల్ , జట్టు ఆటగాళ్లు గిలగిలా తల్లడిల్లి పోయారు. ఇక ధర్మశాలలో పరుగుల వరద పారింది. రజిత్ పాటిదార్ కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 5 ఫోర్లు 9 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాటిదార్ కు తోడు విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తో 43 రన్స్ చేశాడు. కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 43 పరుగులతో రాణించాడు. అనంతరం మైదానంలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలోనే 162 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రాహుల్ తెవాటియా 68 పరుగులు చేస్తే బట్లర్ 29 రన్స్ చేశారు. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్ బాట పట్టారు.