తిరుమల : ఇటీవల కాలంలో తిరుమలలో దర్శనాలు, గదులు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో భక్తులను నమ్మబలికి మోసగించి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలపై టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేరకు సదరు నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించింది టీటీడీ. ఇందులో భాగంగా కీలక ప్రకటన చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో, పోలీసుల సమన్వయంతో సోషియల్ మీడియాలో శ్రావణ్ కళ తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఐడీతో భక్తులను మోసగిస్తున్న చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామసాని పవన్ కుమార్ అలియాస్ నాగరాజు, బోడిరెడ్డి చెన్నకేశవులు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపింది టీటీడీ. ఇటీవల సోషియల్ మీడియాలో భక్తులను మోసగిస్తున్న ఉందంతాల దృష్ట్యా భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది.
ఎవరైనా తిరుమలలో దర్శనాలు, గదులు తీసి ఇస్తామని చెబితే నమ్మకూడదని భక్తులను కోరడమైనది. అలాంటి వ్యక్తుల సమాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెంః9866898630కు ఫిర్యాదు చేయాలని టీటీడీ సూచించింది. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది శ్రీవారి భక్తులకు. మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. టీటీడీ ముందస్తుగా అధికారికంగా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి , సేవలకు గాను ఒక నెల ముందుగానే ప్రకటన విడుదల చేస్తుందని స్పష్టం చేసింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే వినియోగించాలని కోరింది.
