అమరావతి : ప్రపంచ వ్యాప్తంగా ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్స్, మాడ్యులర్ డిజైన్లు, డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్, ఆపరేషనల్ రెసిలియన్స్లో ప్రధాన ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రపంచ వ్యాప్త చర్చ శైలి మారుతోందని నేను భావిస్తున్నానని అన్నారు నారా లోకేష్. న్యూక్లియర్ ఎనర్జీ పాత్ర లేకుండా భారీ కర్బన ఉద్గారాల తగ్గింపు, పారిశ్రామికస్థాయి విద్యుదీకరణకు విశ్వసనీయ మార్గం లేదని ప్రపంచ దేశాలు క్రమంగా గుర్తిస్తున్నాయన్నారు. ఏఐ విప్లవం ఈ గుర్తింపును మరింత వేగవంతం చేస్తోందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఇప్పుడు నేరుగా దీర్ఘకాలిక న్యూక్లియర్ భాగస్వామ్యాలను పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఏఐ భవిష్యత్తు ఇంధన భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందన్నారు. భవిష్యత్ లో నమ్మకమైన, స్వచ్చమైన బేస్ లోడ్ విద్యుత్ తప్పనిసరిగా ఉండాలన్నారు మంత్రి.
ఇది ప్రభుత్వాలు, టెక్నాలజీ ప్రొవైడర్లు, తయారీదారులు, పెట్టుబడిదారుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ ఆ భవిష్యత్తులో భాగస్వామ్యం వహించాలని కోరుకుంటోందని చెప్పారు. మేం వాస్తవ దృష్టితో ఆలోచిస్తున్నాం అన్నారు. భవిష్యత్ తరం పారిశ్రామిక వృద్ధికి పునరుత్పాదక శక్తి ఒక్కటే సరిపోదని తాము అర్థం చేసుకున్నాం అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ కంప్యూట్ విస్తరిస్తున్న కొద్దీ, విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని చెప్పారు నారా లోకేష్. కేవలం ఒక హైపర్స్కేల్ ఏఐ-నేటివ్ డేటా సెంటర్ ఒక మధ్యస్థ పట్టణం ఎంత విద్యుత్ వాడుతుందో అంత ఇంధనాన్ని ఉపయోగిస్తుందని అన్నారు.
పెద్దఎత్తున డేటా సెంటర్లు, సెమికండక్టర్ పార్కులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి క్లస్టర్లు, పారిశ్రామిక కారిడార్లను ఏకీకృతంగా అభివృద్ధి చేసేటప్పడు భారీ పరిమాణంలో విద్యుత్ అవసరమవుతుందని చెప్పారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తోందన్నారు. మేము ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ ఎకోసిస్టమ్లలో ఒకటి నిర్మిస్తున్నాం అన్నారు. గ్లోబల్ కంపెనీలు ఏపీలో ముఖ్యంగా విశాఖపట్నంలో గిగావాట్ సామర్థ్యంగల ఏఐ-నేటివ్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చి, పెట్టుబడులు పెడుతున్నాయన్నారు.