అమరావతి : మత్స్యకారుల సంక్షేమం కోసం అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్కు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ , కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు. తమను ఎంపిక చేసినందుకు వారు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మత్స్యకారుడికి చేరేలా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సహకార సంఘాల ద్వారా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, సంక్షేమ కార్యక్రమాల అమలుకు పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు అచ్చెన్నాయుడు. నూతన కమిటీ సమన్వయంతో, అంకితభావంతో పనిచేస్తే మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకు రావచ్చని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో తమ సర్కార్ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తందన్నారు. మిర్చి మార్కెట్ యార్డుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు ఏర్పాటు, మరుగుదొడ్లు శుభ్ర పరచటం, విశ్రాంతి కొరకు బెడ్ షీట్స్ ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థను మొరు గుపరచడం, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
ఈ సారి సీజన్ ముందుగా రావడం వలన రైతులకు అన్నదాన కార్యక్రమం ముందస్తుగానే మొదలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్కెట్ లో ఉన్న పోటీ ధరలు చెల్లించాలని రవాణా సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. ఆకస్మిక వర్షాలు కురిస్తే మార్కెట్ యార్డులో ఉన్న బస్తాలు తడిసి పోతున్నాయని ఇందుకు ప్రత్యాహ్నయ ఏర్పాట్లను చేయాలని అన్నారు. రైతులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిధ్దంగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు హమీ ఇచ్చారు.
