హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణపై కూడా నోరు పారేసుకున్నారు. తాము రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తామని, వాటి పరిష్కారం కోసం పోరాడుతామని వెల్లడించారు . తాము ప్రతి సమస్యపైనా గళం విప్పుతాం… ప్రతి అన్యాయాన్నీ ఎదిరిస్తామని ప్రకటించారు. నా తెలంగాణ భారతదేశంలో ఒక అవిభాజ్య భాగం అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాం అన్నారు. తాము పొత్తులతో వెళ్తామా..? లేక ఒంటరిగా వెళ్తామా అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించ లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన గౌరవప్రదంగా జరగలేదని, తెలంగాణ రాష్ట్రం సక్రమంగా దక్కలేదన్నదే మా ఆవేదన అని అన్నారు. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలను వారు ఇంకెన్నాళ్లు రెచ్చగొడతారంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు స్పందించడం తప్పా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ప్రాంతీయ విద్వేషాలు జాతీయ సమగ్రతకు భంగం కలిగిస్తాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే రహదారికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెడతామని వెల్లడించారు. చెరువు స్థలాన్ని ఆక్రమించామని రుజువైతే, నేను స్వచ్ఛందంగా దానిని అప్పగిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ మేము గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అన్నారు.
