న్యాయవాదులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసర జాబితాకు సంబంధించిన కేసులను త్వరలోనే జాబితా చేస్తామని స్పష్టం చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్. అస్వస్థత కారణంగా ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు అందుబాటులో లేకుండా పోయారని వెల్లడించారు. దీని వల్ల కేసుల విచారణలో ఇబ్బంది ఏర్పడుతోందని దీనిని గమనించాలని సూచించారు సీజేఐ.
తమ కేసులను త్వరగా లేదా అత్యవసరంగా జాబితా చేయాలని కోరడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్దేశించిన కేసుల కంటే ఎక్కువగానే బెంచ్ మీదకు వస్తున్నాయని వాటిని కూడా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు జస్టిస్ ధనంజయ చంద్రచూడ్.
కొంత మంది న్యాయమూర్తులు అస్వస్థతకు గురయ్యారు. వారు ఇప్పుడు వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత ఇబ్బంది ఏర్పడడం తప్పదన్నారు. దీనిని సహృదయతతో అర్థం చేసుకుని సహకరించాలని సూచించారు సీజేఐ. వాళ్లు అందుబాటులో లేనందు వల్ల కేటాయించిన తేదీలను మార్చడం జరగదన్నారు. లిస్టు చేసిన వాటిని యధావిధిగా విచారణ చేపడతారని వెల్లడించారు ధనంజయ చంద్రచూడ్. కొందరు న్యాయమూర్తులు కరోనా వ్యాధిన బారిన పడ్డారని తెలిపారు.
