Vizianagaram Police: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న గ్యాంగ్ అరెస్ట్
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న గ్యాంగ్ అరెస్ట్
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ… నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్న ఘరానా ముఠా గుట్టురట్టు చేసారు విజయనగరం పోలీసులు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏడుగురు నిరుద్యోగుల నుంచి రూ. 53 లక్షలు వసూలు చేసిన ముఠాను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మంది సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు… వారి వద్ద నుండి ఆరు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రదీప్ నగర్ కు చెందిన నిందితుడు కె.సాయి వెంకట్ సుజిత్… ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదంచాలని వాట్సాప్ లో పోస్టు పెట్టాడు. దానిని చూసిన విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు సుజీత్ను సంప్రదించారు. విజయవాడలోని సెక్రటేరియట్లో పలు ప్రభుత్వ విభాగాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి… ఒక్కొక్కరి నుండి 5.5 లక్షల నుండి 10 లక్షల వరకు మొత్తం 53 లక్షల రూపాయలు వసూలు చేసాడు. నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్మొంట్ ఆర్డర్లు సృష్టించి వారికి ఇచ్చాడు. అనంతరం వారిని విజయవాడ తీసుకొచ్చి నెల రోజుల పాటు అక్కడే ఉంచారు. రోజూ వారిని సెక్రటేరియట్ కు తీసుకెళ్లి… క్యాంటిన్ తో పాటు వివిధ డిపార్ట్మెంట్లలో తిప్పాడు. అనంతరం ఏ జిల్లాలో జాయిన్ కావాలో త్వరలో చెప్తాను ఇంటికి వెళ్ళిపోమని పంపించేసాడు.
అయితే వారి నుండి ఎంతకీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితుల్లో ఒకరైన ఎస్.కోటకు చెందిన ఎస్.వినోద్… విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసిన సీఐ ఎస్. శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు బాధితుల బ్యాంకు లవాదేవీల ఆధారంగా ముఠా సభ్యులను గుర్తించారు. ఈలోగా ముఠాలో కీలక నిందితుడైన సాయి వెంకట్ సుజిత్ కు ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు మిగతా నిందితులు సీహెచ్ మహేష్, రూబిన్ కుమార్, జాన్, యాకూబ్ విజయనగరం వస్తున్నట్లు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారు. హైదరాబాద్లో నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసినట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులనూ త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సుజిత్ కోలుకోగానే అరెస్ట్ చేస్తామన్నారు. కేసు ఛేదించినందుకు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్నకుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.