అమరావతి : రాష్ట్రంలో చేపట్టిన గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . అమరావతి లోని వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాకులో కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా అటవీ శాఖ ఉన్నతాధికారులతో కీలక సూచనలు చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతి ప్రియా పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల. అటవీ శాఖ పరిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడికక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలో ఉన్న ఓఎన్జీసీ సైట్ లో గ్యాస్ లీక్ వల్ల తలెత్తిన బ్లో అవుట్ ప్రభావం గురించి కూడా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్లో అవుట్ చోటు చేసుకున్న ప్రాంతానికి కిలో మీటరు పరిధిలో ఉన్న పాఠశాలలను ఖాళీ చేయించామని తెలుపుతూ ఇరుసుమండ ప్రాంతంలో చేపడుతున్న చర్యలను కలెక్టర్ డిప్యూటీ సీఎంకు వివరించారు.
