హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదలకు మెరుగైన రీతిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గుండె సంబంధిత వ్యాధుల నివారించాలన్న లక్ష్యంతో అందరం కలిసి ఒక మిషన్గా పని చేద్దామని పిలుపునిచ్చారు. ప్రత్యేకించి కార్డియాలజిస్టులు స్పచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు సీపీఆర్ చేయడంలో శిక్షణ ఇవ్వగలిగితే దేశంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ఫెలో ఇండియయా కాన్ఫరెన్స్ -2026లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 500 మంది కార్డియాలజిస్టులు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో పాల్గొన్నారు.
తాను వృత్తి పరంగా డాక్టర్ కానప్పటికీ నిర్వహిస్తున్న పదవీ బాధ్యతల పరంగా సామాజిక వైద్యుడి పాత్ర పోషిస్తూ సమాజంలోని సమస్యలకు చికిత్స అందిస్తానని చెప్పారు. సీపీఆర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించగలిగితే సమాజానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు సీఎం. ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామని చెప్పారు రేవంత్ రెడ్డి. వైద్యులు మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను ఎప్పుడూ మర్చిపోవద్దని అన్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్య సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ విధానాలను మరింత మెరుగు పరచేందుకు మీలాంటి వైద్యులతో కలిసి పని చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మీ సూచనలు, అభిప్రాయాలు అందించాలని కోరారు.
