న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై స్పందించింది. ఈ మేరకు ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలకు గాను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చేశారో, ఎలాంటి చర్యలు చేపట్టారో స్పష్టంగా నివేదిక అందజేయాలని ఆదేశించింది ధర్మాసనం. రెండు వారాల లోపు స్టేటస్ రిపోర్ట్ తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇది చివరి ఛాన్స్ అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాని వార్నింగ్ ఇచ్చింది. గతంలో సీజేఐ నిప్పులు చెరిగారు. స్పీకర్ ను బోనులో నిలబెట్టాల్సి వస్తుందని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి.
శుక్రవారం జస్టిస్లు సంజయ్ కరోల్, ఏజీ మసిహ్లతో కూడిన ధర్మాసనం నిప్పులు చెరిగింది. ఒకానొక దశలో స్పీకర్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి దాకా సమయం ఇచ్చినా ఎందుకని తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. అయితే స్పీకర్ ఈ ప్రక్రియను ముగించడానికి ఎనిమిది వారాల సమయం కోరారు. స్పీకర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ , ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు. ఏడు కేసులలో తీర్పు వెలువడిందని, ఒక కేసులో తీర్పు రిజర్వ్ చేయబడిందని సమర్పించారు. స్పీకర్కు కంటి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చినందున ఆయన అన్ని అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేక పోయారని తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరపు లాయర్ దీనిపై అభ్యంతరం తెలిపారు.
