దాడుల‌ను స‌హించం తిప్పి కొట్ట‌డం ఖాయం

ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిపై దాడి దారుణం

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్యక‌ర్త‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై దాడులు చేసినా, ఎవ‌రు పాల్ప‌డినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జనగామ పట్టణంలో త‌మ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నించిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని అన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి సీతక్క సమక్షంలోనే పట్టపగలు కొందరు కాంగ్రెస్ గుండాలు తాగొచ్చి వీధి రౌడీల్లా వ్యవహరించడం తెలంగాణలో దిగజారిన శాంతి భద్రతలకు అద్దం పడుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓవైపు ముఖ్యమంత్రి అధికార మత్తులో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే, కింద కాంగ్రెస్ గుండాలు మద్యం మత్తులో వీర్రవీగుతూ విధ్వంసం సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు.

అధికారికంగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వద్ద కూడా “డ్రంక్ అండ్ డ్రైవ్” టెస్టులు పెట్టాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొని ఉందన్నారు కేటీఆర్. ఇది అత్యంత బాధాక‌ర‌మ‌న్నారు. ముఖ్యమంత్రే స్వయంగా నేరాలను పెంచి పోషించేలా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్ ను తీవ్రంగా దెబ్బతీసే సంఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. బీఆర్ఎస్ పార్టీతోపాటు తెలంగాణ సమాజం కూడా ఈ గడ్డపై ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెట్టిందన్నారు.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రికి, అధికార పార్టీ అరాచక పర్వానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!