హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 2024 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు , సంస్కృతి రంగాలలో వ్యక్తులకు , సంస్థలకు గత ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున బహూకరించారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం 2025లో మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, గ్రామీణ ఆరోగ్యం , వైద్య దాతృత్వం , కార్పొరేట్ స్వచ్ఛంద సేవ అనే నాలుగు రంగాలలో వ్యక్తులు, సంస్థలు చేసిన విశిష్ట సేవలు , స్వచ్ఛంద కృషిని గుర్తించి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రతిపాదించారు.
నవంబర్ 2025లో తమ తమ రంగాలలో విశిష్టతను ప్రదర్శించిన వ్యక్తులు, సంస్థల నుండి ఆఫ్లైన్ , ఆన్లైన్ పద్ధతుల ద్వారా నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి. గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను కేంద్ర మాజీ హోం కార్యదర్శి , పద్మభూషణ్ అవార్డు గ్రహీత, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఛైర్మన్ అయిన కె. పద్మనాభయ్య నేతృత్వంలోని విశిష్ట అవార్డుల ఎంపిక కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. జ్యూరీలోని ఇతర సభ్యులు సి.ఆర్. బిస్వాల్, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ సునీతా కృష్ణన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత , ప్రఖ్యాత సామాజిక కార్యకర్త , మహిళా ఉద్యమకారిణి, డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, హెల్త్ కేర్ స్పెషలిస్ట్, రమేష్ కాజా, సెక్రటరీ జనరల్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నారు.
వ్యక్తుల పరంగా చస్తే మహిళా సాధికారత కింద రమాదేవి కన్నెగంటి, గిరిజన అభివృద్దికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా వాఘాపూర్ కు చెందిన తోడసం కైలాష్, గ్రామీణ ఆరోగ్యం, వైద్య దాతృత్వం కింద హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రద్యుత్ వాఘ్రే , కార్పొరేట్ స్వచ్చంద సేవ విభాగంలో హైదరాబాద్ కు చెందిన వి. రాజన్న ను ఎంపిక చేశారు. ఇక సంస్థల పరంగా చూస్తే మహిళా సాధికారత కింద ఘట్ కేసర్ కు చెందిన శ్రీ సాయి సోషల్ ఎంపవర్మెంట్ సొసైటీ , గిరిజన అభివృద్దికి సంబంధించి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇండిజినస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, గ్రామీణ ఆరోగ్యం, వైద్య దాతృత్వం – కింద హైదరాబాద్ కు చెందిన రామదేవ్ రావు హాస్పిటల్ , కార్పొరేట్ సేవకు సంబంధించి గివ్ ఫర్ సొసైటీని ఎంపిక చేశారు. ప్రతి అవార్డుకు రూ. 2,00,000 నగదు బహుమతి తో పాటు ప్రశంసా పత్రాలు ఇస్తారు.
