హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ల అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత మే 2025 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్లు సందర్శించారు? ఎన్ని ఈమెయిల్స్, లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికెట్లు జారీ అయ్యాయి? మిగిలిన వాటిని కారణం చెప్పకుండా ఎందుకు తిరస్కరించారు? దీనిపై పూర్తి వివరాలను ప్రజలకు తెలియ చేయాలని అన్నారు హరీశ్ రావు.
జీఎం ఆఫీసు ముందు సెల్ఫీలు దిగి, మేము సైట్ విజిట్ చేశామని, మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని అనేక కంపెనీలు ఈమెయిల్ చేశాయన్నారు. NCC కంపెనీ, GRN కంపెనీ, మహాలక్ష్మి కంపెనీ.. ఇలా ఎన్నో కంపెనీలు పంపిన ఈమెయిల్స్ అన్నింటినీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మీరు బయట పెట్టకపోతే మేమే ఆ ఈమెయిల్స్ను బయట పెడతామని సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తన్నీరు హరీశ్ రావు. ఇదిలా ఉండగా సైట్ విజిట్ సర్టిఫికెట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన అబద్ధాలను ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి. సింగరేణి పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడవాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి టెండర్ల ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారని స్పష్టమవుతోందన్నారు.
