హైదరాబాద్ :హైదరాబాద్ పోలీసులకు సంబంధిచి ప్రత్యకంగా ఏర్పాటైన షీ టీమ్స్ సంచలనం సృష్టించింది. ఈ మేరకు షీ టీమ్స్ కు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును వెల్లడించారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ షీ టీమ్స్ 1,100కు పైగా ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. 3,800 మంది దుండగులు పట్టుబడ్డారని వెల్లడించారు.
మహిళల భద్రత పై హైదరాబాద్ పోలీసులకు రాజీలేని ప్రాధాన్యతగా ఉంటుందని పునరుద్ఘాటించారు. వేధింపులను ముఖ్యంగా డిజిటల్ బ్లాక్మెయిల్ , సైబర్ స్టాకింగ్ను కఠినంగా, ఎటువంటి రాజీ లేకుండా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఏ నేరస్థుడూ అజ్ఞాతత్వం లేదా సాంకేతికత తమను చట్టం నుండి కాపాడుతుందని భావించ కూడదన్నారు. తాము ప్రతి ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తామన్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మహిళలు మౌనంగా బాధ పడకూడదని కోరారు సజ్జనార్. కళంకం లేదా పరువు పోతుందనే భయం బాధితులను సహాయం కోరడానికి ఎప్పుడూ నిరోధించకూడదని కమిషనర్ పేర్కొన్నారు. మీ గుర్తింపు, గోప్యతను కాపాడతామని స్పష్టం చేశారు సీపీ. ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉంటుందన్నారు. బాధితుల కేంద్రీకృత పద్ధతిలో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ విధానానికి అనుగుణంగా, హైదరాబాద్ షీ టీమ్స్ గత సంవత్సరంలో 1,149 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. రహస్య నిఘా, మారువేషపు ఆపరేషన్లు , సాంకేతిక నైపుణ్యం కలయికను ఉపయోగించి, నగర పోలీసుల ప్రత్యేక విభాగం 2025లో వివిధ రకాల వేధింపులకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 3,826 మందిని అరెస్టు చేసిందన్నారు.
