మామల్లాపురం : టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఏడాదిలో జరిగే ఎన్నికలు ఎన్నికలు కానే కాదన్నారు. ఆయన అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్ష పార్టీలను ఏకి పారేశారు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ సూటిగా ప్రశ్నించడం కలకలం రేపుతోంది. అధికారంలో ఉన్న డీఎంకేను దుష్ట శక్తి అని, అన్నా డీఎంకేను అవినీతి కి కేరాఫ్ అంటూ ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ఎదుర్కొనే సత్తా టీవీకే పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఆదివారం టీవీకే విజయ్ తమిళనాడు లోని చెంగల్పట్టు జిల్లా మామల్లాపురంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య యుద్దంగా ప్రకటించారు. అంతే కాదు స్థిరపడిన రాజకీయ శక్తులను సవాలు చేయడానికి తన పార్టీకి ఉన్న ప్రత్యేక స్థానాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఇదిలా ఉండగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ఈ ప్రజాస్వామ్య యుద్ధానికి నాయకత్వం వహించబోయే కమాండర్లు మీరేనని నొక్కి చెప్పారు. తమిళనాడులో హిందీకి స్థానం లేదన్నారు. నిజంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే సత్తా ఒక్క తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ప్రధానంగా ప్రజలను రక్షించడానికి , హాని కలిగించాలని చూసే వారి నుండి ఈ నేలను కాపాడటానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. తాము పదవుల కోసం ఇక్కడికి రాలేదన్నారు టీవీకే విజయ్. తాడో పేడో తేల్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని కుండ బద్దలు కొట్టారు .
