అమరావతి : ఈ దేశ విముక్తి కోసం ఎందరో తమ విలువైన ప్రాణాలు త్యాగం చేశారు. వారు చేసిన త్యాగాలు, బలిదానాల వల్లనే ఇవాళ భారత దేశం సమున్నతమైన రీతి లో ముందుకు సాగుతోందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జరిగిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు.
సుమారు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్రం సిద్ధించడానికి, స్వాతంత్ర సమర యోధులు అహింసా సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశారని చెప్పారు. ప్రపంచ దేశాలలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన నేపథ్యంలో 1950 జనవరి 26వ తేదీ నాడు గణతంత్ర దేశముగా ఏర్పడిందన్నారు. ఈ రోజును పురస్కరించుకొని భారత గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించికుంటూ వస్తున్నామన్నారు సీఎం. అప్పటి అమర వీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు.
ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈ గణతంత్ర దినోత్సవం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచి పోతుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ ముఖ్యమైన సందర్భంగా ప్రభుత్వ అజెండా, దార్శనికతను అనర్గళంగా వివరించినందుకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు .
