చెన్నై : 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. సోమవారం ఆయన జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము ఏక రూప భారత దేశాన్ని కోరుకోవడం లేదని అన్నారు. 143 కోట్లమంది ప్రజలు కేవలం ఏకీకృత భారత దేశం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆయన త్రిభాషా విధానాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన నిరంతరం కేంద్రంతో ఘర్షణ పడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. భారతదేశంలో అనేక స్వరాలు ఉన్నాయని అన్నారు. అనేక గుర్తింపులు దేశాన్ని తీర్చిదిద్దాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని ఏకరూప భారతదేశంగా కాకుండా, ఐక్య భారతదేశంగా జరుపుకోవాలని నొక్కి చెప్పారు. సంస్కృతులు ఒకదానికొకటి సుసంపన్నం చేసుకుంటూ, భాషలు గర్వంగా సహ జీవనం చేసే దేశంగా ఇది కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతి పౌరుడు గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో , స్వేచ్ఛతో జీవించ గలిగినప్పుడే భారతదేశం ముందుకు సాగుతుందన్నారు. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో రెచ్చగొడుతూ ప్రజల మధ్య విద్వేషాలను రగిలిస్తూ వస్తున్న వారికి ఇది చెంపపెట్టుగా మారాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగురూకతతో ఉండాలని సూచించారు ఎంకే స్టాలిన్.
విశ్వాసం ఒక వ్యక్తిగత సత్యంగా ఉండే దేశంగా మనం కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం.మన బలం ఎప్పుడూ ఏకరూపత కాదన్నారు. అది ఎల్లప్పుడూ మన బహుళత్వం. వైవిధ్యం రక్షించ బడినప్పుడు, ఐక్యతా భావన సహజంగా ఉంటుందన్నారు ఎంకే స్టాలిన్.
