తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను బదిలీ చేసింది. ఆయన కూడా రిలీవ్ అయ్యారు. ఇక ముద్దాడ రవిచంద్ర స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ముద్దాడ రవిచంద్ర కెరీర్ విషయానికి వస్తే తను 1996వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ఏపీకి చెందని సీనియర్ అధికారి. ఆగస్టు 19, 1972లో పుట్టారు. 24 ఏళ్ల వయసులోనే 1995లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. బి.టెక్. (మెకానికల్ ఇంజనీరింగ్) డిగ్రీ పూర్తి చేశారు.
అనేక ముఖ్యమైన పరిపాలనా పదవులను నిర్వహించారు. విశ్లేషనాత్మక నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టు ఉంది ముద్దాడ రవిచంద్రకు. తొలుత ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు. చిత్తూరు డీపీఏపీ పీడీగా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, నెల్లూరు , చిత్తూరు జిల్లాల కలెక్టర్ గా ఉన్నారు. ఏపీహెచ్ఎం ఎండీగా, వైస్ చైర్మన్ గా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా, ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శిగా, ఏపీచ్ ఎం ఎండీగా, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీగా, సామాజిక, గిరిజన సంక్షేమ కార్యదర్శిగా, వైద్య, ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శిగా, మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు ముద్దాడ రవిచంద్ర. ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొలువు తీరనున్నారు.
