కరీంనగర్ జిల్లా : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ వల్లనే ఇవాళ మున్సిపాలిటీలు ప్రగతి పథంలో దూసుకు వెళుతున్నాయని అన్నారు కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా కరీంనగర్ జిల్లాలో ఆయన విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండా ఎగుర వెయ్యడమే లక్ష్యం అని ప్రకటించారు. రాంనగర్ సత్యనారాయణ స్వామి గుడి చౌరస్తా, కమాన్ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. 46వ డివిజన్ అభ్యర్థి అఖిల్ గౌడ్ , 47వ డివిజన్ అభ్యర్థి గాజె రమా శివరాం , 38వ డివిజన్ అభ్యర్థి దేవసాని సరస్వతి, 56వ డివిజన్ అభ్యర్థి తాటి ప్రభావతి , 57వ డివిజన్ అభ్యర్థి కొలిపాక రమ్యశ్రీ తరఫున ప్రచారం చేశారు.
కరీంనగర్ లోని ప్రతి వాడలో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో జరిగినవేనని ఈ సందర్బంగా ప్రకటించారు బండి సంజయ్ కుమార్ పటేల్. కరీంనగర్ లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదల్లా నిధులు తెచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను గెలిపిస్తే మీ ఇండ్లలోకి వరద నీళ్లు వస్తాయే తప్ప అభివృద్ధి జరగదన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం రూ.1500 కోట్లు తీసుకు వచ్చానని చెప్పారు. మేయర్ పీఠం బీజేపీకి కట్టబెడితే భవిష్యత్తులో మరిన్ని నిధులు తెస్తానని అన్నారు.
బీజేపీ పక్షాన పోటీ చేసే అభ్యర్థులు గుణవంతులైతే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ధనవంతులు అని ఆరోపించారు. మా వాళ్లు మీ సమస్యలపై పోరాటం చేసి జైలుకు పోతే, ఆ పార్టీల నాయకులు కబ్జాలు, దోపిడీలు చేసి జైలుకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల సమితిగా తయారైందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కబ్జాలు చేసి దోచుకుంటే, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అంతకంటే ఎక్కువ దోచుకుంటున్నారని సంచలన ఆరపణలు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ కు మాత్రం నయాపైసా ఇయ్యలే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయ లేదని అన్నారు..
