అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం అని ఆవేదన చెందారు. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూలు చేస్తున్నాం అన్నారు. 2019-24 మధ్య ఆర్ధిక క్రమశిక్షణ దెబ్బ తీశారని ఆరోపించారు.. జీతాలు కూడా మొదటి తేదీకి ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. ఇప్పుడు జీతాల చెల్లింపులను గాడిలో పెట్టాం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న కొన్ని జిల్లాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఆ జిల్లాలు లైమ్ లైట్లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని అన్నారు. సోమవారం సచివాలయంలో తన అధ్యక్షతన కీలకమైన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి అవకాశాలు కన్పిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కశ్మీర్ లో మాత్రమే కుంకుమ పువ్వు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ కూడా ఏర్పాటు అవుతుందన్నారు.కాఫీ సాగు పెంచటంతో పాటు అరకు కాఫీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాం అన్నారు. ఇది మరింతగా పెరగాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. సంజీవని ద్వారా జూలై 2026 నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. 5 లక్షల మంది హాస్టల్ విద్యార్ధుల స్ర్కీనింగ్ చేపట్టాలి. 12వ తరగతి వరకూ ఉన్న 70 లక్షల మంది విద్యార్ధుల హెల్త్ ప్రోఫైల్స్ కూడా తయారు చేయాలని అన్నారు. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం, పెరుగుదలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. పౌష్టికాహారం అందించటంతో పాటు అవసరమైన సప్లిమెంట్స్ అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు.
