ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జ‌రిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిహారం అంద‌జేశారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకే అందర్నీ సచివాలయానికి పిలిచి పరిహారం అందించామని చెప్పారు. ఈ ప్ర‌భుత్వం మీది. ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అంద‌రికీ అండ‌గా ఉంటామని ముఖ్య‌మంత్రి బాధిత కుటుంబాల‌కు భ‌రోసా ఇచ్చారు. ప్ర‌మాదం జరిగినట్లు తెలుసుకున్న వెంట‌నే మంత్రి అజ‌హ‌రుద్దీన్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మ‌దీనాకు పంపామ‌ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు.

చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌క్ష‌ణ‌మే పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి మ‌దీనా పంపించామ‌న్నారు. అక్క‌డి భార‌త్ కాన్సులేట్‌, సౌదీ ప్ర‌భుత్వంతో చ‌ర్చించి మృతి చెందిన వారి అంత్య‌క్రియ‌లు జ‌న్నుతుల్ బ‌ఖీలో చేయించిన విషయాలను గుర్తు చేశారు. నవంబర్ 17, 2025 న మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున, గాయపడిన ఒకరి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం అందించారు.

దేశం బ‌య‌ట జ‌రిగే ప్ర‌మాదాల్లో మృతిచెందిన వారికి ప్ర‌భుత్వాలు ప‌రిహారం చెల్లించే విధానం లేనప్పటికీ, ప్రభుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయం అందించాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవ‌ల నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించామ‌న్నారు. ముస్లిం సోద‌రుల‌తో త‌నకున్న‌ అనుబంధాన్ని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకున్నారు. తాను కొడంగ‌ల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన 2009 సంవ‌త్స‌రం నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని అయిదు మండ‌లాల నుంచి ఒకొక్క‌రి చొప్పున ఏటా అయిదుగురిని త‌న సొంత ఖ‌ర్చుల‌తో హ‌జ్ యాత్ర‌కు పంపుతున్నాన‌ని చెప్పారు. వారిని ఎంపిక చేసే బాధ్య‌త స్థానిక ముస్లిం మ‌త పెద్ద‌ల‌కే అప్ప‌జెప్పాన‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!