నిజామాద్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు శాశ్వతం కాదని ప్రజలే చరిత్ర నిర్మాతలని పేర్కొన్నారు. నిజామాబాద్ (ఇందూర్) పార్లమెంట్ పరిధిలో నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ఏర్పాటు చేసిన “ఆత్మీయ అభినందన సభ”కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈటల రాజేందర్. గెలిచిన వారిని ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడారు. అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ని తాము శీనన్న అని పిలుచుకునే వాళ్ళం అని గుర్తు చేసుకున్నారు రాజేందర్ . శీనన్న మంచి మానవతా వాది. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారని, తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. నా ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మహాభారతంలో ధర్మరాజు లాంటి పాత్రను పోషించి అందరిని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడానికి కీలక పాత్ర పోషించిన వారిలో శీనన్న ఒకరు అని ప్రశంసలు కురిపించారు ఈటల రాజేందర్. నేను ఆర్థిక మంత్రిగా మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడు ప్రతిపక్షంలో ఉండి విమర్శించాల్సిన నాయకుడు కూడా హుందాగా నన్ను అభినందించారని ఇది ఆయన సంస్కారం అని కొనియాడారు. రాజకీయాల్లో సీనియర్లు, జూనియర్లు అని చర్చ జరుగుతోందని, ఒక పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని కాదు రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారని దాన్ని బట్టి సీనియారిటీ ఉంటుందన్నారు ఈటల రాజేందర్.
తొలికోడి కూసినట్టు తెలంగాణ రాజకీయాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు తొలి నిర్ణయం తీసుకుంటారని, తెలంగాణ ఉద్యమంలో సైతం తొలి జెడ్పీ చైర్మన్ గెలిచింది ఇక్కడేనని గుర్తు చేశారు. ఈ జిల్లాల ప్రజలు డబ్బులకు లొంగే వారు కాదని, వీరిని మాయ చేసుడు కష్టం అని అన్నారు. మొత్తం తెలంగాణలో మొదట ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చి వ్యవసాయం ఈ జిల్లా వారే చేశారని, రైతు జిల్లా ఇందూర్ జిల్లా అని పేర్కొన్నారు. ఇందూర్ లో ఈ దఫా అతి ఎక్కువ గెలిచింది బీజేపీనేనని, రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.