అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డి పై భగ్గుమన్నారు. తన ఆధ్వర్యంలో ఏపీ వందేళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దుతూ ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇస్తోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ విధానం కూడా సులభతరం చేస్తున్నాం అన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశామని, ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పారు సీఎం. రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామన్న మా మాటను నమ్మి అధికారం ఇచ్చారని తెలిపారు.
నంద్యాల జిల్లాలో పార్లమెంట్ సహా 8 మందిని గెలిపించారని, ఈ సందర్బంగా పేరు పేరునా వారందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు సీఎం. సీమలో 7 సీట్లు తప్ప అన్నింటా కూటమి అభ్యర్థులను గెలిపించారని గుర్తు చేశారు. ప్రజాహితం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలు, వివాదాలు తప్పా ఏమున్నాయని అన్నారు. 30 వేల మంది కల్తీ మద్యం తాగి గత ప్రభుత్వంలో చనిపోయారని వాపోయారు. ఎక్సైజ్ శాఖలో నెలకు రూ.100 కోట్లు అవినీతి చేశారని ఆరోపణలు చేశారు. పేదల ఆరోగ్యాని కంటే వారికి డబ్బులే ముఖ్యం అంటూ ఎద్దేవా చేశారు.తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారని ధ్వజమెత్తారు.
కాగా గతంలో సీమలో ముఠా నాయకులు ఉండేవారని, ఎన్నికల సమయంలో డబ్బుల కంటే బాంబులు అడిగే పరిస్థితి ఉండేదన్నారు సీఎం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్బగ్యాలు ఉండకూడదని… ఈ ప్రాంతంలో ముఠా తగాదాలను తుదముట్టించాం అని చెప్పారు. ముఠాలు వద్దు గ్రామాల్లో ప్రశాంతతే ముద్దు అని చెప్పి వైరం ఉన్న నేతలను కలిపానని అన్నారు . డోన్ నియోజకవర్గంలో 30 చెరువులకు హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చామని తెలిపారు. సీమలో హంద్రీనీవా, నగరి గాలేరు, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే… వీటిని పూర్తి చేసే అదృష్టం నాకు దక్కిందని చెప్పారు చంద్రబాబు నాయుడు.