హైదరాబాద్ : అంతరిక్ష ఆధారిత సాంకేతికతను వినియోగించి ప్రజా ఆస్తులతో పాటు సరస్సులను రక్షించేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చేస్తున్న కృషిని ఇస్రో శాస్త్రవేత్తలు అభినందించారు. ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్టర్ డా. ప్రకాష్ చౌహాన్, ఇస్రో మాజీ ఛైర్మెన్ ఏఎస్ కిరణ్ కుమార్తో పాటు పలువురు హైదరాబాద్ లో జరిగిన సదస్సులో మాట్లాడారు. చెరువులు, పార్కులు కాపాడడంలో హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఎన్ ఆర్ ఎస్ సీ సెంటర్లో శాస్త్రవేత్తల సమక్షంలో “హైడ్రా-రక్ష” పౌర కేంద్రిత పోర్టల్ ప్రారంభమైంది. ఓ ఆర్ ఆర్ పరిధిలోని చెరువులు, నాలాల హద్దులతో పాటు.. భూముల వివరాలు తెలుసు కునేందుకు హైడ్రా – రక్ష పోర్టల్ ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.
చెరువులు, ప్రభుత్వ భూములతో పాటు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను ప్రజలు కొని మోస పోకుండా సరైన సమాచారం ఈ పోర్టల్ ద్వరా ప్రజలకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. కొంటున్న ప్లాట్లు చెరువుల చెంత ఉన్నాయా, లేక నాలాల బఫర్లోనివా అనేది తెలుసు కోవడానికి వీలు కుదురుతుందని చెప్పారు. జిల్లా / మండలం / గ్రామం, సరస్సు పేరుతో పాటు భౌగోళిక సమన్వయాలు (Geographic Coordinates) ఈ పోర్టల్లో ఎంటర్ చేస్తే సంబంధిత ప్రాంతం ఆటోమేటిక్గా జూమ్ అవుతుందని స్పష్టం చేశారు. ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) సరిహద్దులు, బఫర్ జోన్లు తెలుస్తాయని అన్నారు. “హైడ్రా-రక్ష” పోర్టల్ను మొదట్లో కొన్ని వారాల వరకూ హైడ్రా అంతర్గత వినియోగానికి మాత్రమే వినియోగిస్తుందని తెలిపారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తుందన్నారు.
